మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు ప్రచార గడువు నవంబర్ 1 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు తమ అభ్యర్థుల గెలుపుకై ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరపున ప్రచారానికి టిఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు నేతృత్వం వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో ఉండగా టిపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు.
మరోవైపు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున రాష్ట్ర బీజేపీ కీలక నాయకులు ప్రచారం కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాక పోరులో 23 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ ఉపఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తూ ప్రచార వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. హుజూర్ నగర్ తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఉపఎన్నిక జరుగుతుండడంతో ప్రజల్లో కూడా ఆసక్తి నెలకుంది. నవంబర్ 3 న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 10 న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu