తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023లో భాగంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వాకాటి కరుణ, నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, పరీక్షల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల కోసం మొత్తం 9,51,022 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలిపారు.
అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షల నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల అధ్యక్షతన జిల్లాస్థాయిలో హైపవర్ కమిటీలను ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణ బాధ్యత ఈ కమిటీలదేనని మంత్రి పేర్కొన్నారు. అన్ని విభాగాల అధికారులతో సమన్వయం ద్వారా, ఎటువంటి పొరపాట్లకు కూడా తావు లేకుండా ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ఇక ప్రతి పరీక్ష కేంద్రంలోనూ నిఘా కోసం, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక పరీక్షల సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించే దిశగా ప్రతీ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE