ఆంధ్రప్రదేశ్ లోని న్యాయవాదులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, లా డిగ్రీ అందుకున్నాక మొదటి మూడేళ్లపాటు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకం వారికి తోడుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పథకం కింద 2,011 మంది జూనియర్ అడ్వకేట్లకు రూ.1,00,55,000 బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించామని, జూనియర్ న్యాయవాదులకు వారి కెరీర్ ప్రారంభంలో ఒడిదుడుకులను తట్టుకునేందుకు అవసరమయ్యే ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. కాగా 2019 నుంచి ఇప్పటి వరకు 4,248 మంది జూనియర్ న్యాయవాదులు వైఎస్ఆర్ లా నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందారని, ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేల చొప్పున ఇప్పటి వరకు రూ.35.40 కోట్లు చెల్లించామని తెలిపారు. ఇక ఈ పథకం కింద, లబ్ధిదారులకు మూడేళ్లపాటు లేదా 35 ఏళ్లు వచ్చే వరకు, ఏది ముందుగా ఉంటే అది నెలకు రూ. 5,000 అందించబడుతుందని సీఎం జగన్ వివరించారు.
కాగా న్యాయ శాఖ నోడల్ ఏజెన్సీ ఈ-ప్రగతి ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇక ఇప్పటివరకూ వైఎస్ఆర్ లా నేస్తం కింద లబ్ధిదారులకు 2019-20లో రూ.4.95 కోట్లు, 2020-21లో రూ.8.28 కోట్లు, 2021-22లో రూ.12.59 కోట్లు, 2022-23లో రూ.8.56 కోట్లు సాయం ప్రభుత్వం అందించింది. అలాగే న్యాయవాదుల కోసం ఉద్దేశించిన మరో పథకం అడ్వకేట్ సంక్షేమ నిధి. ఈ మేరకు రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్తో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అడ్వకేట్ జనరల్ చైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్) ట్రస్టీగా, లా సెక్రటరీ మేనేజింగ్ ట్రస్టీగా ఉంటారు. దీనిలో భాగంగా ఏపీ బార్ కౌన్సిల్కు ఇప్పటివరకు మొత్తం 25 కోట్ల రూపాయలు వరకు విడుదలయ్యాయి. ఈ కార్పస్ ఫండ్ ద్వారా అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, వైద్యం సహా ఇతర అవసరాల నిమిత్తం ఆర్ధిక సాయం అందించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE