తెలంగాణ ఐటీ, పరిశ్రమలు మరియు పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జర్మనీ వేదికగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఏషియా బెర్లిన్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ఆయనకు నిర్వాహకులు ఆహ్వానం పంపారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో జూన్ 12 నుంచి 15వ తేదీ వరకు ఈ సమ్మిట్ జరుగనుంది. ఇక ఇటీవలే చైనా వేదికగా ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీలలో నిర్వహించనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొనాల్సిందిగా.. ఫోరం అధ్యక్షుడు బోర్గె బ్రెండే మంత్రి కేటీఆర్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏషియా బెర్లిన్ సమ్మిట్ నుంచి కూడా ఆహ్వానం అందడం విశేషం. జర్మనీ సెనేట్కు చెందిన ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ ఈ ఆహ్వానం పంపింది. దీనిలో ఎనర్జీ, మొబిలిటీ, లాజిస్టిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్టెక్, వాతావరణ మార్పులు వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
దీనిలో భాగంగా ‘కనెక్టింగ్ స్టార్ట్అప్ ఎకో సిస్టం’ అనే అంశంపై చర్చ నిర్వహించనున్నామని, ఈ సదస్సులో పాల్గొని ఇందులో ప్రసంగించాలని వారు మంత్రి కేటీఆర్ను కోరారు. కాగా ప్రతి ఏటా జర్మనీ, అసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేేసందుకు చేపట్టే ఈ సదస్సు ద్వారా భారత్తో పాటు ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా జర్మనీలోని స్టార్టప్లను ఆసియా ఖండంలోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పెట్టుబడిదారులకు ప్రత్యేక సెషన్ ఉంటుందని, అద్భుతమైన ఆలోచనలున్న స్టార్టప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కూడా నిర్వాహకులు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE