కొద్ది రోజుల క్రితం వరకూ రాజకీయ వలసలన్నీ.. కాంగ్రెస్ వైపు ఉండేవి.. ఇప్పుడు పరిస్థితి మారిందా..? రాజకీయాల్లో .. రాజకీయ నేతల ఆలోచనల్లో మార్పు వచ్చిందా.. కేసీఆర్ స్ట్రాటజీ వర్కవుటవుతుందా..? అంటే అవునన్నట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వైపు క్యూ కట్టిన నేతలు ఇప్పుడు భారతరాష్ట్రసమితి(బీఆర్ఎస్) కార్యాలయాల వైపు కారు తిప్పుతున్నారు. మొన్నటికి మొన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ నేత పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ కి ఇక సెలవంటూ బీఆర్ ఎస్ లో చేరారు. నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ భారతీయ జనతాపార్టీ(బీజేపీ)కి రాం రాం చెప్పి బీఆర్ఎస్లో చేరారు. ఇద్దరినీ పార్టీలోకి ఆహ్వానించారు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి మాట ఇస్తే తప్పరనే నమ్మకంతోనే ఇద్దరు మహిళా నేతలు ధీమాగా గులాబీ గూటికి చేరుకున్నారు. ఇప్పడు రాజకీయంగా తమకు ప్రయోజనం లేకపోయినా భవిష్యత్కు ఢోకా ఉండదనే విశ్వాసంతోనే బీఆర్ఎస్లో చేరినట్లుగా తెలుస్తోంది. తమకు అవసరమున్నంత వరకుమాత్రం మహిళా నేతల్ని వాడుకున్న కాంగ్రెస్, బీజేపీలు తీరా ఎన్నికల వేళ వారికి మొండి చేయి చూపుతున్నాయని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో, వందల కోట్లు వ్యయమైన సందర్భంలో బీఆర్ఎస్, బీజేపీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువైన కష్టకాలంలో కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతిరెడ్డి పోటీ చేశారు. తండ్రి పాల్వాయి గోవర్ధన్రెడ్డి హయాం నుంచి నియోజకవర్గంలో ఉన్న ఓటు బ్యాంకు తదితర కారణాలతో ఓడిపోయినా గౌరవం మాత్రం కోల్పోలేదు. గౌరవప్రదమైన ఓట్లు పడ్డాయి.
అదే ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. కాంగ్రెస్లోకి వచ్చీ రాగానే తన చేతికాడి సీటును లాక్కొని ఆయనకు ఇవ్వడంతో తట్టుకోలేకపోయారు. కేటీఆర్ హామీతో, తన అనుయాయులకూ తగిన భవిష్యత్నిస్తారనే నమ్మకంతో బీఆర్ఎస్లో చేరారు. ఇక తుల ఉమది ఇంకా విచిత్రమైన పరిస్థితి. కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ అయిన ఆమెకు బీజేపీ వేముల వాడ టిక్కెట్ను కేటాయించింది. తీరా సమయం వచ్చేప్పటికీ బీఫామ్ ఇవ్వకుండా దాన్ని వికాస్రావుకు ఇచ్చింది. పార్టీలో చేర్చుకున్నప్పుడు కానరాని అభ్యంతరాలు, పనిచేసినంత కాలం అడ్డురాని పాత చరిత్రలు టిక్కెట్ ఇచ్చేందుకు మాత్రం అభ్యంతరంగా నిలిచాయి. ఈ పరిస్థితిలోనూ ఏమీ పాలుపోని ఆమెకు బీఆర్ఎస్ స్నేహహస్తం అందించింది. ఆమె కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇద్దరికీ ఇప్పుడిక పోటీ చేసే అవకాశం లేదనీ తెలుసు. బీఆర్ఎస్ నుంచి టిక్కెట్లు రావనీ తెలుసు. అయినా బీఆర్ఎస్లో చేరారంటే కారణం భవిష్యత్తులో తగిన గుర్తింపు నిస్తారనే నమ్మకం. మాటిస్తే తప్పరనే ధీమాతో పలువురు అటువైపు మళ్లుతున్నారు.
వీరిద్దరే కాదు… ఈ రెండు పార్టీల నుంచే కాదు. ఇతర పార్టీల వారు సైతం బీఆర్ఎస్నే కోరుకుంటున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీనే వీడి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం తెలిసిందే. వైఎస్సార్టీపీ నుంచి కూడా పలువురు గులాబీ గూటికి చేరేందుకు వరుసలో ఉన్నారు. ఆ పార్టీలు లేకుండా పోయినా.. వాటిల్లోని వారు మిగతా పార్టీల వైపు కనీసం కన్నెత్తి చూడకుండా బీఆర్ఎస్ వైపే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు అనంతరం ఎల్బీనగర్ కు చెందిన రామ్మోహన్ గౌడ్ దంపతులు మంత్రి హరీశ్ రావు మంత్రాంగంతో తక్కువ వ్యవధిలోనే మళ్లీ బీఆర్ ఎస్కు వచ్చేశారు. అలాగే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన విష్ణు ఇప్పటికే బీఆర్ ఎస్ లో చేరి.. ఆ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చోటామోట నేతలు కాంగ్రెస్ వైపు వెళ్తున్నా.. కీలక నేతలు సడెన్ గా బీఆర్ ఎస్ వైపు టర్న్ తీసుకుంటుండడం ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE