తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నాడు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ నూతనంగా నిర్మించిన సెమినార్ హాల్, లైబ్రరీలను ప్రారంభించారు. అనంతరం అక్కడ వార్డులలో జ్వరంతో బాధపడుతున్న వారిని మంత్రులు పరామర్శించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో వైద్యులకు కొరత లేదని స్పష్టం చేసారు. నాలుగు రోజులుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఫీవర్ ఆసుపత్రిలో ఆగస్టు నెలలో 51 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే 62 మందికి మాత్రమే డెంగీ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాయంత్రం ఓపీ ఏర్పాటు చేస్తున్నామని, సెలవులు లేకుండా వైద్యులు పని చేస్తున్నారని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. రోగులకు సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, దేశవ్యాప్తంగా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. మీడియా వాస్తవాలను చూపించాలని కోరారు, ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని, జరుగుతున్న పరిస్థితులను పబ్లిసిటీ కోసం వాడుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు.
[subscribe]
[youtube_video videoid=dGSvroR_1L8]