సికింద్రాబాద్ లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో అన్ని భారీ, ఎత్తైన భవనాలకు, వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్టుమెంట్లలో సేప్టి ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్ పేట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందచేయాలని నిర్ణయించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రధాన నగరాలలో అన్ని భారీ/ఎత్తైన భవనాలకు ఫైర్ సేప్టి ఆడిట్ నిర్వహించాలని, మున్సిపల్, పోలీస్, ఫైర్, తదితర శాఖల అధికారులతో కలసి నిర్ణిత కాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. వీటితోపాటు అన్ని ఆసుపత్రులు, పాఠశాల భవనాలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాములు, వ్యాపార, వాణిజ్య భవనాలు, ఎత్తైన అపార్టుమెంట్లలో సేప్టి ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. అయితే, ఫైర్ సేప్టి ఆడిట్ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గణనీయంగా పెరుగుతున్న నగర ప్రజల భద్రత అత్యంత ప్రధానమని, ఈ విషయంలో అవసరమైతే 1999లో రూపొందించిన ఫైర్ సేప్టి చట్టాలను మార్చేందుకు తగు ప్రతిపాదనలను పంపాలని మంత్రి సూచించారు. పోలీస్ శాఖకు అందించిన విధంగానే అగ్నిమాపక శాఖకు కూడా ఆధునిక వాహనాలు, అగ్నిమాపక యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందుకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని సీఎస్ శాంతి కుమారిని కోరారు. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై సకాలంలో స్పందించి ప్రాణ నష్టం కలుగ కుండా చర్యలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ అగ్నిప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, నగరంతో పాటు ఇతర నగరాలలో భారీ అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపట్టేవిధంగా మార్గ దర్శకాలు సూచించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 25 లక్షల వ్యాపార, వాణిజ్య సముదాయాలున్నాయని, ఇవన్నీ తమ స్వంత ఫైర్ సేప్టీ జాగ్రత్తలు తీసుకునేవిధంగా తగు మార్గదర్శకాలు జారీ చేయాలని పేర్కొన్నారు. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, భవననిర్మాణాలు జారీ చేసే సమయంలోనే ఫైర్ సేఫ్టీపై కఠిన నిబంధనలు విధించాలని అన్నారు.
సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, భారీ అగ్ని ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై తగు ప్రతిపాదనలు సమర్పించడానికి ఉన్నతస్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఫైర్ శాఖకు కావాల్సిన ఆధునిక యంత్ర సామగ్రి కొనుగోలుకు తగు ప్రతిపాదనలు సమర్పించడంతోపాటు, ఫైర్ శాఖ అధికారులకు, సిబ్బందికి ఆధునిక విధానాలపై తగు శిక్షణ నివ్వడానికి చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. అగ్ని ప్రమాద కారకమైన వ్యాపార, సంస్థలలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హైదరాబాద్ డిప్యూటి మేయర్ మోతే శ్రీలత రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఇంధన, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమీషనర్ డీ.ఎస్.చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, మేడ్చల్ కలెక్టర్ హరీష్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE