ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులలో విద్యార్ధుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, వారం రోజులలోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల తల్లిదండ్రులతో స్కూల్ మేనేజ్ మెంట్ (ఎస్ఎంసీ) కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, తరగతి గదుల మరమ్మతులు, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం, ప్రహారీగోడ నిర్మాణం వంటి మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాబోధన జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన వివరించారు. ఇందుకోసం చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమం పనుల పర్యవేక్షణలో ఎస్ఎంసీలను భాగస్వాములను చేయడం ద్వారా పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది:
అదేవిధంగా పనులు చేపట్టడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానిక ఎమ్మెల్యే లేదా, ఎమ్మెల్సీల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ డీఈఓలతో వారి పరిధిలలో పాఠశాల్లో జరుగుతున్న పనులపై మంత్రి సమీక్షించారు. నాది అనే భావనతో ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని సూచించారు. అధికారులు కార్యాలయలకే పరిమితం కాకుండా పనులు త్వరితగతిన చేపట్టి పూర్తిచేసేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. మన బస్తీ-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ ల కొరకు తీవ్రపోటీ నెలకొనే పరిస్థితులు రానున్న రోజులలో ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు.
సుల్తాన్ బజార్ లో శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పూర్తిస్థాయిలో నిర్మించేందుకు ఒక స్వచ్చంద సంస్థ సిద్దంగా ఉందని, ప్రభుత్వ పరంగా అనుమతులు కావాల్సి ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొనగా, బుధవారం మధ్యాహ్నం ఆ పాఠశాలను అధికారులతో కలిసి సందర్శించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ వాకాటి కరుణ, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్సీలు ప్రభాకర్, సురభి వాణిదేవి, జాఫ్రీ, జనార్ధన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, మౌజం ఖాన్, కలెక్టర్ శర్మన్, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓలు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ షఫీ, జీహెఛ్ఎంసీ, టీఎస్ఎంఐడీసీ తదితర ఇంజనీరింగ్ విభాగాల, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF