అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో డిసెంబర్ 5, గురువారం నాడు కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) సమావేశమైంది. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పలు పరిణామాలపై చర్చించి తదుపరి కార్యచరణ రూపొందించనున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, శాంతి భద్రతల క్షిణించడం, ఆర్టీసీ బస్ చార్జీల పెంపు, నిరుద్యోగ అంశం, మద్యం నియంత్రణపై పోరాటం, ఫ్లై ఓవర్ ప్రమాదాలు వంటి పలు అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలంతా చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 14న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టనున్న ‘భారత్ బచావో’ ర్యాలీకి తెలంగాణ రాష్ట్రం నుంచి జనసమీకరణ పై బుధవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. గాంధీభవన్లో జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియాతో పాటుగా షబ్బీర్ అలీ, జానారెడ్డి, జగ్గారెడ్డి, వేణుగోపాల్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ‘భారత్ బచావో’ ర్యాలీకి జనసమీకరణ బాధ్యతలను కీలక స్థాయి నేతలకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి సుమారు నాలుగు వేల మంది ఢిల్లీలో జరిగే ర్యాలీకి హాజరుకాబోతునున్నట్టు తెలుస్తుంది.
[subscribe]