మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావు పుట్టిన రోజైన జూన్ 28 నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం సీనియర్ పార్లమెంటు సభ్యుడు కె.కేశవరావు ఆధ్వర్యంలో కమిటిని సీఎం నియమించారు. మంత్రులు కేటిఆర్, ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, కుమార్తె వాణీదేవి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు.
కాగా ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలో ఈ కమిటీ ఈ రోజు సమావేశమై ఉత్సవాలకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ, పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి, దేశంలో పీవీ నరసింహారావు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. జూన్ 28న నెక్లెస్ రోడ్డులోని జ్ఞానభూమిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అలాగే ఆయన పేరు మీద మ్యూజియం, ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. పీవీ నరసింహారావు స్వగ్రామమైన వంగరను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అంశంపై కూడా చర్చించామని తెలిపారు. పీవీ శత జయంతి ఉత్సవ కార్యక్రమాల వివరాలను, ఆయన జయంతి రోజున సీఎం కేసీఆర్ విడుదల చేస్తారని కేశవరావు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu