బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జనగామ జిల్లాలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. బండి సంజయ్ను టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అవినీతి కుటుంబ పాలనపై వ్యతిరేకతతో రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీకి లభిస్తున్న భారీ మద్దతును చూసి సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాడి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను తుడిచిపెట్టేస్తామని అన్నారు. అలాగే బండి సంజయ్ అరెస్ట్ ను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు కూడా ఖండించారు.
సాయంత్రం నిరసన దీక్షలు:
మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా ఈరోజు (ఆగస్టు 23, మంగళవారం) సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోని పార్టీ కార్యాలయాల వద్ద నల్లగుడ్డలు ధరించి శాంతియుత నిరసన దీక్ష చేపట్టాలని నాయకులకు, కార్యకర్తలకు బీజేపీ పిలుపునిచ్చింది.
ముందుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద నిరసన తెలిపిన బీజేపీ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, అందుకు నిరసనగా ధర్మదీక్షను చేపడుతున్నట్టు బండి సంజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజా సంగ్రామ యాత్రలో బసచేసిన చోటే, మంగళవారం ఉదయం స్టేషన్ఘన్పూర్ మండలం పామ్నూర్లో బండి సంజయ్ ధర్మదీక్ష తలపెట్టగా పోలీసులు భగ్నం చేశారు. దీక్ష శిబిరం పోలీసుల మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ను అదుపులోకి తీసుకోకుండా బీజేపీ కార్యకర్తలు, సంగ్రామ సేన కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలోకి ఎక్కించారు. పోలీసు వాహనాన్ని కూడా బీజేపీ శ్రేణులు కొంతసేపు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం నిరసన దీక్షలకు బీజేపీ పిలుపునిచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY