నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కాగా ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ అభ్యర్థిని ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీలో ఉండనున్నారని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
మునుగోడులో కాంగ్రెస్ తరపున ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తే పాల్వాయి స్రవంతి. కాంగ్రెస్ అభ్యర్థులుగా కృష్ణా రెడ్డి, పల్లె రవి, కైలాష్ నేత పేర్లు కూడా వినిపించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర పీసీసీ సభ్యురాలుగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మెంబర్ గా ఉన్న పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు ఉపఎన్నికకై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఇక్కడ కాంగ్రెస్ను ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలాబలాపై ఎప్పటికప్పుడు కమిటీలతో చర్చలు జరుపుతున్నారు
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మునుగోడు ఎమ్మెల్యే పదవీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉండగా, అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగబోతున్నారో ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY