తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీని ఏర్పాటు చేసి ఈసారి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న ఆయన దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే జాతీయ పార్టీ పేరుని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. విజయదశమి పండుగ సందర్భంగా.. సీఎం కేసీఆర్ ఆ రోజున కొత్త జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగా దసరా రోజు టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంతో పాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశం కూడా నిర్వహించనున్నారు. ముందుగా టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేయనున్నారు. అనంతరం జరుగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ కోఆర్డినేటర్లను ప్రకటించొచ్చని తెలుస్తోంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తాను జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడతానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీల నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశం కూడా అవుతున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుసుకుని చర్చిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ రేపు ఉదయం 11 గంటలకు యాదాద్రికి వెళ్లనున్నారు. జాతీయ పార్టీని ప్రకటించే ముందు ఆయన ఇష్ట దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 5వ తేదీన జాతీయ పార్టీ పేరుని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా పార్టీ పేరుకి సంబంధించి మొత్తం నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, అయితే వీటిలో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY