హైదరాబాద్ లోని హెఛ్ఐసీసీ వేదికగా నేడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేడు (జూలై 2), రేపు (జూలై 3) జరగనున్న ఈ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, అగ్ర నాయకులు, 18 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షులు సహా మొత్తం 350 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం జూలై 3, ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తుంది. ఈ భారీ బహిరంగ సభను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సభకు ప్రధాని మోదీతో పాటుగా అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు, పలు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా సభలో వేదికలు ఏర్పాటు చేసి, అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.
ఈ విజయ సంకల్ప సభకు 10 లక్షల మందికిపైగా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఈ సభలో 2 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు జరిగాయి. అదేవిధంగా నాయకుల ప్రసంగాలు అందరికి స్పష్టంగా చేరేలా గ్రౌండ్ లో మొత్తం 30 ఎల్ఈడీ స్క్రీన్స్ కు ఏర్పాటు చేశారు. మరోవైపు సభకు హాజరయ్యే వారికీ పార్కింగ్ కోసం జింఖానా, హెఛ్సీఏ, బైసన్ పోలో, మడ్ ఫోర్డ్ హాకీ మైదానాలతో పాటుగా, జేబీఎస్ పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేశారు. జనసమీకరణపై రాష్ట్ర బీజేపీ నేతలు ముందుగానే దృష్టి పెట్టి 119 నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అలాగే హైదరాబాద్ నగరమంతా కాషాయ జెండాలతో అలంకరించి, పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సహాన్ని, సందడిని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా మార్చేలా, అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొనేది మరియు ప్రత్యామ్నాయం తామేనని చాటి చెప్పేలా, తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ భారీ సభ నుంచే ప్రధాని మోదీ సహా, అగ్రనేతలు రాష్ట్ర పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు ప్రధాని మోదీ ఆదివారం 10 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.55 గంటలకు హెచ్ఐసీసీ వద్ద హెలిపాడ్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకొని, అనంతరం 6.30 గంటలకు రోడ్డుమార్గంలో పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటల నుండి రా.7.30 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. రాత్రి 7.35 గంటలకు సభ దగ్గర నుండి బయలుదేరి, రాజ్ భవన్ కు చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY