తెలంగాణలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మొదటి డోస్ వేశామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. దేశంలోనే 100 శాతం మొదటి డోస్ వేసిన పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత ప్రణాళిక వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది, పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల సిబ్బంది సహకరించటం వలన ఇలాంటి రికార్డు సాధించగలిగామని వివరించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. మొదటి డోసు వంద శాతం పూర్తయిన సందర్భంగా కోఠి లోని డీపీహెచ్ కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… వంద శాతం మొదటి డోస్ పూర్తిచేసిన మొదటి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలవటం గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటిన 2.77 కోట్ల మందికి ఫస్ట్ డోస్ వేశామని చెప్పారు. అయితే, రాష్ట్రానికి ఎక్కువగా కొవిషీల్డ్ టీకాలు వచ్చాయని, రెండవ డోస్ కు వ్యవధి ఎక్కువ ఉండటంతో.. రాష్ట్రంలో సెకండ్ డోస్ కవరేజీ కాస్త తక్కువగా ఉన్నదని వివరించారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది, క్షేత్రస్థాయిలో ఉంటూ ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్స్ వేస్తున్నారని చెప్పారు. వారందరికీ మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ