తెలంగాణ అసెంబ్లీ ఏడో రోజు సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లు ఉపసంహరణ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ముందుగా దేశంలో ప్రజలు, రైతాంగంపై ప్రభావం చూపే విద్యుత్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్రం తెస్తున్న కొత్త విద్యుత్ చట్టం చాలా ప్రమాదమని అన్నారు. దేశంలో పలు రాష్ట్రాలు సైతం ఈ విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.
ఈ చట్టం ద్వారా విద్యుత్ రంగంపై రాష్ట్రాల హక్కులు, అధికారాలు కేంద్రం ఆధీనంలోకి వెళ్లే అవకాశముందని పేర్కొన్నారు. కేంద్రం తెచ్చే నూతన విద్యుత్ చట్టం అమల్లోకి వస్తే కొత్త మీటర్ల కోసమే రూ.700 కోట్లు కావాలన్నారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రాలకు విద్యుత్ రంగంపై నియంత్రణ ఉండదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కూడా మద్దతిచ్చాయి. దీంతో కేంద్ర విద్యుత్ బిల్లు ఉపసంహరణ తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu