తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై సందిగ్థత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం నాడు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారులు మధ్య మరోసారి భేటీ జరగనుంది. ఇరు రాష్ట్రాల రవాణా శాఖ ముఖ్యకార్యదర్శులు సహా ఇతర అధికారులు పాల్గొనే ఈ సమావేశం హైదరాబాద్లో జరగనుంది. ఇటీవలే హైదరాబాద్ బస్ భవన్ లో ఓసారి చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. రెండు రాష్ట్రాలు సమాన దూరం(కీ.మీ) బస్సులు నడపాలనే ప్రతిపాదన వద్ద ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ రోజు జరిగే సమావేశంలో అధికారుల మధ్య చర్చలు కొలిక్కి వస్తే, బస్సు సర్వీసులు ప్రారంభంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మరోవైపు కిలోమీటర్ల ఆధారంగా అధికారుల ఒప్పందం కుదిరిన తర్వాతనే రాష్ట్రాల మంత్రుల స్థాయిలో సమావేశం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu