కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఏ ప్రత్యర్థి నేతపై ఐటీ, ఈడీ దాడులు జరిగినా.. కేంద్ర ప్రభుత్వమే చేయించిందని విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేయడం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వమే ఈ సోదాలు చేయిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ తక్కువగా ఉంది. రోజురోజుకి ఆ గ్రాఫ్ మరింత తగ్గుతూ పోతోంది. అటు అసంతృప్తితో పార్టీ నుంచి సీనియర్లు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఎంపీ వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు కూడా వేరే పార్టీలోకి వెళ్లేందుకు ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య ఐటీ అధికారులు.. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు చేశారు. బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చిగురింట పారిజాత నరసింహారెడ్డి,రియల్టర్ గిరిధర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
అయితే ఈ దాడులను అనుకూలంగా మలుచుకొని బీజేపీ, బీఆర్ఎస్లపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. భయపెట్టి నేతలను లొంగదీసుకునేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని ఆరోపించింది. ఆ పార్టీ నుంచి సీనియర్లు తమ పార్టీలో చేరుతుంటే.. తట్టుకోలేక దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉంది. ఇప్పుడు ఎన్నికల వేళ ఐటీ దాడులు జరగడం వల్ల.. బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE