ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు:
వ్యవసాయం, పౌర సరఫరాల శాఖ సన్నద్ధతపై చర్చ:
- వర్షాపాత వివరాలు, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగయిన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాలపై కేబినెట్ చర్చించింది. వానాకాలంలో పంటల కొనుగోలుపై అందుకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై కేబినెట్ చర్చించింది.
పోడు భూముల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ నియామకం:
- పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకై కేబినెట్ సబ్ కమిటీ నియామకం జరిగింది. ఈ సబ్ కమిటిలో మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్ గా, మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్ లు సభ్యులుగా వ్యవహరిస్తారు.
హోం శాఖపై సమీక్ష:
- కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఇతర పోలీస్ స్టేషన్లలోని సమస్యలు అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్ర కరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు సభ్యులుగా ఉంటారు.
ధరణి పోర్టల్ సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ:
- ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికై మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.
- ఈ నెల 24వ తేదీ నుండి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
- రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్ల మరమ్మతుకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన రూ. 300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.
- రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విజ్ఞప్తి మేరకు, నారాయణగూడలో బాలికల వసతి గృహ నిర్మాణం కోసం 1,261 గజాల స్థలాన్ని కేటాయించిన కేబినెట్.
ఇరిగేషన్ పై కేబినెట్ చర్చ, తీర్మానాలు:
- సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 టిఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ.2,653 కోట్ల పరిపాలన అనుమతికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం ఎడమ వైపు నుంచి 8 టిఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణ్ ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 166 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ.1,774 కోట్ల పరిపాలన అనుమతికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నాబార్డు ద్వారా రుణాలు పొందడానికి కూడా కేబినెట్ సాగునీటి శాఖకు ఆమోదం ఇచ్చింది.
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 15, 16 లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణమౌతున్న నృసింహసాగర్ (బస్వాపూర్ జలాశయం) నాబార్డు ద్వారా రూ.2051.14 కోట్ల రుణం పొందడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ