తెలంగాణ శాసనసభ రెండో రోజు బడ్జెట్ సమావేశాలు సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడకు బయలుదేరారు. జన్వాడ పరిధిలో నిర్మాణాలు పరిశీలనకు వెళ్లిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గండిపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా జన్వాడలో 111 జీవోకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఫాంహౌజ్ అక్రమంగా నిర్మించారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫాంహౌస్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, డి.శ్రీధర్బాబు, సీతక్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి లను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు.