టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో రాష్ట్రంలో ప్రజాచైతన్య యాత్ర చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్ర చేపట్టే అవకాశం ఉంది. ఈ యాత్ర సుమారు 45 రోజులపాటు కొనసాగనుంది.
ఈ బస్సు యాత్రలో మూడు రాజధానుల అంశం, పెట్టుబడులు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఇతర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. చంద్ర బాబు బస్సు యాత్రను ఏ ప్రాంతం నుంచి ప్రారంభిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే మరో మూడు రోజుల్లో బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు కానుంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లు, కీలక నాయకుల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర నిర్వహించనున్నారు.
[subscribe]