దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (జులై 2, శనివారం) యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వచ్చారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి అధికార టీఆర్ఎస్ పార్టీ మద్ధతు తెలుపుతున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగులు, గులాబీ జెండాలతో ప్రత్యేక సందడి వాతావరణం సృష్టించారు. ముందుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతం పలికారు. అలాగే ఎయిర్ పోర్టులో యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన వారిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
అనంతరం అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వరకు యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జలవిహార్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం కానున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లతో పాటుగా పార్టీ ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా జరిగే సభలో ముందుగా సీఎం కేసీఆర్ ప్రసంగిచనున్నారు. అనంతరం యశ్వంత్సిన్హా మాట్లాడి, రాష్ట్రపతి ఎన్నికలలో టీఆర్ఎస్ సభ్యుల మద్ధతు కోరనున్నారు. జలవిహార్ లో సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పర్యవేక్షించి, నేతలకు కీలక సూచనలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ తో సమావేశం అనంతరం తనకు మద్ధతు తెలిపిన కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు నేతలతో కూడా యశ్వంత్సిన్హా వేర్వేరుగా భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఇక శనివారం సాయంత్రం యశ్వంత్సిన్హా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY