రెండు రోజుల పాటు జరగనున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశం నేడు హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఈ కార్యవర్గ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ అగ్ర నేతలు హాజరుకానున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లను భారీగా చేస్తోంది. రానున్న ఎన్నికలు, అన్ని రాష్ట్రాలకు పార్టీ విస్తరణ తదితర అంశాలపై నేతలు చర్చించనున్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు భారీ స్థాయిలో నిర్వహించలేకపోయింది. అయితే వచ్చే ఏడాది పలు రాష్ట్రాల శాసనసభలకు, ఆ తర్వాత ఏడాది లోక్సభకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలో.. ఈ సమావేశాలపై పార్టీ దృష్టి సారించింది. ఈ సమావేశాలకు బీజేపీ లోని అతిరథమహారధులు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు హైదరాబాద్ విచ్చేస్తున్నారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారమే నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి బస చేసిన హోటల్ వరకు తెలంగాణ బీజేపీ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈరోజు సాయంత్రం మాదాపూర్ హెచ్ఐసీసీ (కాకతీయ) ప్రాంగణంలో కార్యవర్గ సమావేశాలు మొదలు కానున్నాయి.
రేపు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రితో పాటు బీజేపీ జాతీయస్థాయి కీలక నేతలు అనేకమంది రెండు రోజులు నగరంలో ఉంటున్నందున పోలీసులు అసాధారణ రీతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రధాని బందోబస్తు కోసం సుమారు 8 వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. ఇక ఈ సమావేశాల అనంతరం సోమవారం ఉదయం ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ