కేంద్రం అనుసరిస్తున్న వరి సేకరణ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 61 లక్షల మంది రైతులు మరియు వారి కుటుంబాలను ప్రభావితం చేసే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వరి సేకరణ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఒక రోజు ధర్నాకు దిగింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఈ మహా ధర్నా కార్యక్రమానికి వేదిక అయింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎత్తిచూపేందుకు టీఆర్ఎస్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మరియు జాతీయ రహదారులపై నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ మహా ధర్నాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర పార్టీల నేతలు సహా దాదాపు 1500 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొంటున్నారు.
పంజాబ్లో ఉత్పత్తి చేస్తున్న వరిధాన్యం మొత్తం తెలంగాణలోనూ ఉత్పత్తి అయిన వరి నిల్వలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ) కొనుగోలు చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తున్న ప్రధాన డిమాండ్. అయితే తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు యోచిస్తోంది. కాగా, తెలంగాణ రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేయటానికే ఈ నిరసనను చేపట్టామని టీఆర్ఎస్ పేర్కొంది. కాగా సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, టీఆర్ఎస్ లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ తదితరులు భారీ ఎత్తున తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఈరోజు చేస్తున్న మహా ధర్నాలో పలువురు జాతీయ నాయకులూ, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొనే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ