హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఉప ఎన్నికలను తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెరాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉప ఎన్నికల ప్రచారంలో ఈ నెల 18న పాల్గొనబోతున్నట్టు సమాచారం. 18న హుజూర్నగర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఈ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లకు పార్టీ నాయకులు సమాయత్తమవుతున్నారు. తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే అక్టోబర్ 4న హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ షో నిర్వహించి ప్రచారాన్ని మొదలు పెట్టారు.
మరోవైపు అక్టోబర్ 10 నుంచి హుజూర్నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించేలా పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున ఇప్పటికే రాష్ట్ర మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి తరపున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రముఖు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడ త్వరలో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తుంది.
[subscribe]