అధికార వైసీపీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకుల చేరిక ఊపందుకుంది. అక్టోబర్ 8 మంగళవారం నాడు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో, రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావు కూడ వైసీపీ లో చేరారు. అనంతరం ఆకుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలనే వైసీపీలో చేరానని చెప్పారు. ఆకుల సత్యనారాయణ ఇటీవలే జనసేన పార్టీకి రాజీనామా చేసారు.
జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ, గొప్ప పాలన అందిస్తాడనే నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఆశీర్వదించారని చెప్పారు. ఐదుగురు దళితులకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించారని, దేశం మొత్తం ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకుందని అన్నారు. జగన్ పరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. గతంలో పొరపాట్లు తనవైపే ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుంటానని ఆయన తెలిపారు. మొదట్లో వైసీపీలోనే ఉన్న జూపూడి ప్రభాకర్ రావు తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. మళ్ళీ కొంత సమయం తరువాత టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీలో చేరారు.
[subscribe]