తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో భారీ ఎత్తున పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 15,982 ఖాళీలను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను వేగవంతం చేశారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు ఇది ఒక సువర్ణావకాశం కాగా, ఈసారి నియామక నిబంధనలలో మరియు అర్హతలలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులను ప్రవేశపెట్టింది. జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా రాష్ట్రంలోని అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఒక పటిష్టమైన సంకల్పాన్ని చాటింది.
పోస్టుల వివరాలు మరియు జిల్లా వారీ ఖాళీలు
ఈ మెగా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న మొత్తం 15,982 పోస్టులలో 3,100 అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఉండగా, అత్యధికంగా 12,882 అంగన్వాడీ సహాయకుల (హెల్పర్స్/ఆయాలు) ఖాళీలు ఉన్నాయి. గత మూడేళ్లుగా ప్రమోషన్లు, బదిలీలు మరియు పదవీ విరమణల వల్ల ఏర్పడిన ఖాళీలతో పాటు కొత్తగా సృష్టించిన 708 పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లో చేర్చారు.
జిల్లాల వారీగా చూస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 192 టీచర్లు, 1,033 సహాయకుల పోస్టులు ఉన్నాయి. ఖమ్మంలో 136 టీచర్లు, 655 సహాయకులు, నల్గొండలో 148 టీచర్లు, 688 సహాయకులు, హైదరాబాద్ జిల్లాలో 183 టీచర్లు, 402 సహాయకులు, రంగారెడ్డిలో 137 టీచర్లు, 611 సహాయకుల చొప్పున భారీగా ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలలో మార్పు.. ఇంటర్మీడియట్ తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వ ‘సాక్ష్యం అంగన్వాడీ’ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి విద్యా అర్హతలను సవరించింది. గతంలో 10వ తరగతి అర్హతగా ఉన్న నిబంధనను మారుస్తూ, ఈసారి కనీస విద్యా అర్హతగా ఇంటర్మీడియట్ (12th Pass) ఉత్తీర్ణతను తప్పనిసరి చేశారు.
వయోపరిమితి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 40-45 ఏళ్ల వరకు ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా ఆయా గ్రామం లేదా సదరు వార్డు పరిధిలోని స్థానిక నివాసితులై (Local Resident) ఉండాలి. స్థానికత ధృవీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి.
కొత్తగా ఇంటర్వ్యూ విధానం.. మెరిట్ ఆధారంగా ఎంపిక
ఈసారి నియామక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు. అయితే, ఎంపిక విధానంలో పారదర్శకత కోసం సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. అభ్యర్థులు సాధించిన ఇంటర్మీడియట్ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇస్తారు.
మిగిలిన మార్కులకు కొత్తగా ముఖాముఖి (ఇంటర్వ్యూ) విధానాన్ని ప్రవేశపెట్టారు. దరఖాస్తు చేసుకున్న వారిలో వితంతువులు, అనాథలు మరియు దివ్యాంగ మహిళలకు నిబంధనల ప్రకారం ప్రత్యేక ప్రాధాన్యత లేదా వెయిటేజీ మార్కులు లభిస్తాయి. దరఖాస్తుల స్క్రూటినీ మరియు ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలను సీడీపీఓ (CDPO) కార్యాలయాలు పూర్తి చేస్తాయి.







































