తెలంగాణ ముఖ్యమంత్రి త్వరలో సొంత ఊరు చింతమడక లో పర్యటించనున్నారు. అందుకు సంబందించిన అన్ని ఏర్పాట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని, జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ్ రెడ్డి తో కలిసి పర్యటన ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. అధికారులు అన్ని ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో చింతామడక గ్రామంలో అభివృద్ధి పనులను చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం బుధవారం రూ.10 కోట్లు విడుదల చేసింది, ఈ నిధులను ప్రత్యేక అభివృద్ధి నిధి కింద విడుదల చేసినట్లు తెలిసింది.
ఇటీవలే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చింతమడక సర్పంచ్ తో ఫోన్ లో మాట్లాడి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని వివరంగా నమోదు చేసి పెట్టాలని, గ్రామస్తులకు అన్ని విధాలుగా సంక్షేమ పధకాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే అధికారులు పలుమార్లు పెండింగ్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి గ్రామస్తులతో సంభాషించారు. ఈ పర్యటనలో గ్రామస్తులతో కలిసి సీఎం కెసిఆర్ భోజనం చేయనున్నారు.