తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఉన్నతాధికారులు, పలు ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చ్ 2, సోమవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే తెలంగాణకు చెందిన 24 సంవత్సరాల వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలిందని, అతన్ని ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అన్నారు. అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడని, కంపెనీ పని నిమిత్తం ఫిబ్రవరి 15న దుబాయ్ వెళ్లారని, తిరిగి బెంగళూరుకు చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారని ఈటల రాజేందర్ తెలిపారు.
“కరోనా సోకిన యువకుడు ఫిబ్రవరి 17న దుబాయి వెళ్లి నాలుగు రోజులపాటు హాంకాంగ్ వ్యక్తులతో కలిసి పని చేశారు. అనంతరం బెంగుళూరు నుండి బస్సులో హైదరాబాద్ కి వచ్చాడు. జ్వరం రావడంతో సికింద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో ఆదివారం నాడు గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. గాంధీలో టెస్ట్ చేసి, ఆయన రక్త నమూనాలు సేకరించి పుణేకు టెస్ట్ కోసం పంపితే పాజిటివ్ కేసుగా నమోదైంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించామని” మంత్రి ఈటల తెలిపారు. యువకుడు తన కుటుంబ సభ్యులతో 5 రోజులు గడిపారని, అయన కుటుంబ సభ్యులతోపాటు సహచరుల వివరాలు సేకరిస్తున్నామని, వారందరికీ టెస్టులు చేస్తామని అన్నారు.
అలాగే బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో ఆ బస్సులో ప్రయాణించిన 27 మందిని ట్రేస్ చేశామన్నారు. అలాగే ఆ 27 మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఇప్పటికి 80 మందిని గుర్తించామని, వారికందరికి టెస్టులు చేస్తామని పేర్కొన్నారు. పాజిటివ్ కేసుగా నమోదైన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. మున్సిపల్ శాఖ అధికారులతో మీటింగ్ పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అదే విధంగా గాంధీ , చెస్ట్, ఫీవర్ హాస్పిటల్స్ లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసామని అన్నారు. ఈ వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్రోచర్స్ ప్రింట్ చేసి జన సమర్ధ్య ప్రదేశాల్లో ఉంచుతామని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే డాక్టరుని సంప్రదించాలి.
- చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
- గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లును చలి ప్రదేశాల్లో తిరగనివ్వకూడదు.
- దూర ప్రాంతాలకు ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది.
- పెంపుడు జంతువులు ఉంటే వాటికి దూరంగా ఉండాలి.
- ఇంటి పరిసరాలతో పాటు ఇంట్లో పరిశుభ్రత పాటించాలి.
- బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. నోటికి అడ్డు రుమాలు పెట్టుకోవడంతో పాటు మాస్క్ వాడాలి.
[subscribe]