భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో మార్చి 18న ఆఖరి వన్డేలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వన్డే సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు మార్చ్ 2, సోమవారం నాడు ప్రకటించింది. ఈ జట్టులో సీనియర్ ఆటగాడు డుప్లెసిస్, వాన్ డేర్ డసెన్ చోటు సంపాదించారు. 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత డుప్లెసిస్ వన్డే సిరీస్ కు ఎంపిక కావడం ఇదే తొలిసారి. అలాగే యువ లెగ్ స్పిన్నర్ జార్జ్ లిండే కూడా తొలిసారిగా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. 2019 అక్టోబర్లో భారత్తో జరిగిన టెస్టు సిరీస్లోనే జార్జ్ లిండే మొదటిసారిగా అరంగేట్రం చేసాడు. ఇక గాయం కారణంగా పేసర్ కగిసో రబాడ భారత పర్యటనకు ఎంపికవ్వలేదు. మరో వైపు త్వరలో జరగబోయే ఐపీఎల్-2020 సీజన్లో కూడా కొన్ని మ్యాచ్లకు కూడా రబాడ దూరమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
భారత్ తో వన్డే సిరీస్ కు ఎంపికైన దక్షిణాఫ్రికా జట్టు:
క్వింటన్ డికాక్ (కెప్టెన్), బవుమా, డసెన్, డేవిడ్ మిల్లర్, డుప్లెసిస్,హెన్రిచ్ క్లాసెన్, వెర్రిన్నే, జోన్-జోన్ స్మట్స్, ఫెలుక్వాయో, ఎంగిడి, సిపామ్లా, హెండ్రిక్స్, నోర్జె, జార్జ్ లిండె, కేశవ్ మహారాజ్.