రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర హైకోర్టులో వివిధ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండటం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న 24 మంది జడ్జీలతో ఈ కేసుల పరిష్కారం సమస్యగా మారిందని, ఈ నేపథ్యంలో హైకోర్టులో జడ్జీల సంఖ్యను 42 కు పెంచడం వల్ల కేసులు సత్వర పరిష్కారానికి దోహదం చేస్తుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 15, 2019 లో ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రి, సీజేఐ లకు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అంతకు ముందు కేంద్రానికి లేఖ రాశారని వినోద్ కుమార్ వివరించారు. హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతపై తాను 2019 జనవరిలో పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించానని వినోద్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చించినట్లు చెప్పారు. ఎట్టకేలకు రెండేళ్ల తరువాత అయినా సరే తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకోవడం పట్ల వినోద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ( సీజేఐ) ఎన్వీ రమణకు వినోద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ