గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలు రాములు నాయక్ మరియు యాదవ రెడ్డి లపై అనర్హత వేటు వేయ్యాలని తెరాస పార్టీ కోరగా, అప్పటి మండలి చైర్మన్ స్వామి గౌడ్ విచారణ చేపట్టి, వారి పై అనర్హత వేటు వేశారు. మండలి చైర్మన్ అనర్హత వేటు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాములు నాయక్ మరియు యాదవ రెడ్డి హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ రోజు పిటిషన్ ను విచారించి, శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఈ కేసును విచారించిన కోర్టు వారి వాదనలను త్రోసిపుచ్చి, వారు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. శాసనమండలి వారిపై జారీ చేసిన నోటీసులు చట్టానికి విరుద్ధం కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పు తరువాత, తదుపరిగా అనర్హత వేటు పై సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు ఎన్నికలు జరగకుండా చూడాలని ఇద్దరు ఎమ్మెల్సీలు కోర్టును కోరారు. అయితే, ఈ విషయాన్ని పరిశీలించాలని కోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. మండలి చైర్మన్ స్వామి గౌడ్ అనర్హత వేటు వేసిన మరో ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కి సంబందించిన పిటిషన్ పై కూడ ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి, కానీ తీర్పు ఇంకా పెండింగ్ లోనే ఉంది.