పెద్దపల్లి జిల్లాలో రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం పట్టపగలు నడిరోడ్డుపైనే న్యాయవాద దంపతులను దారుణంగా హత్య చేశారు. హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న మంథని మండలం గుంజపడుగుకు చెందిన గట్టు వామనరావు, నాగమణి దంపతులను రామగిరి మండలం కల్వచర్లలో దుండగులు కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ స్పందించారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు మరియు అతని భార్య గట్టు నాగమణి దంపతులను దారుణంగా హత్య చేసిన సంఘటన అమానుషమైనదని, అత్యంత ఖండించదగినదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, చట్టం ప్రకారం నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని హోంమంత్రి చెప్పారు.
న్యాయవాద దంపతుల దారుణ హత్యపై దర్యాప్తు ప్రారంభించబడిందని, ఇప్పటికే పోలీసులు గుర్తించిన నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డితో మాట్లాడి సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ కేసును నార్త్ జోన్ ఐజి, రామగుండం పోలీసు కమిషనర్ పర్యవేక్షించాలని ఆదేశించారు. మరోవైపు రామగుండం సీపీ సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో దుండగులను పట్టుకోవడం కొరకు ప్రత్యేకమైన ఆరు టీమ్ లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని, అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తామని, దుండగులు ఎంతటి వారైనా వదిలేదని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ