రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు కనీసం 12 టికెట్లను గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ఉన్నారు. రాష్ట్రం నుంచి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ని పోటీలో నిలపడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి సారించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే టీపీసీసీ లో తీర్మానం కూడా చేశారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్లలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాల్సిందిగా పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే.. సోనియాగాంధీ ఇందుకు ఒప్పుకుంటారా, లేదా అనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ అంశం ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీలో చర్చోపచర్చలు
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్రంలోని కీలక నేతలతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు నేడు ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ పాల్గొంటున్న ఈ సమావేశానికి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జులుగా నియమితులైన వారు హాజరవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సోనియాగాంధీ పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో స్పష్టత రాగలదని పార్టీ నేతలు భావిస్తున్నారు. సోనియాగాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయాల్సిందిగా టీపీసీసీ ఇదివరకే తీర్మానాన్ని ఆమోదించింది. దానికి సంబంధించి సోనియా గాంధీ అందుకు ఓకే చెప్పారా.. ఒకవేళ ఓకే చెబితే ఎక్కడనుంచి ఆమె పోటీ చేయనున్నారనేది ఈరోజు వెల్లడి కానుందని భావిస్తున్నారు.
ఎక్కడినుంచైనా..
నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఎక్కడినుంచైనా ఆమె పోటీచేస్తే గెలిపించేందకు తాము సిద్ధంగా ఉన్నామని పార్టీనేతలు చెబుతున్నారు. ఇదే తరుణంలో రాష్ట్రంలో పీసీసీ నేతను మారుస్తారా ? అనే అంశంపైనా చర్చ నడుస్తోంది. టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆ పోస్టును ఇతరులకు కట్టబెట్టవచ్చుననే అభిప్రాయాలున్నాయి. అయితే కొత్త వారిని లోక్సభ ఎన్నికలకు ముందే నియమిస్తారా?లేక ఎన్నికల వరకు రేవంత్రెడ్డినే కొనసాగనిస్తారా ? అనేది తేలాల్సి ఉంది. ఆయన నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో అదే ఊపుతో ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే ఆయననే ఎన్నికల వరకు కొనసాగించవచ్చునని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లేని పక్షంలో ఇతరులకు అవకాశం కల్పిస్తారని పేర్కొంటున్నారు.
పీసీసీ చీఫ్ పై సైతం..
పీసీసీ చీఫ్ను మారిస్తే ఆ పదవి కోసం ఆశతో ఎదురు చూస్తున్న వారు ఎందరో ఉన్నారు. సీనియర్నేతలకు కొదవలేని కాంగ్రెస్లో పలువురు ఆ స్థానం కోసం పోటీ పడుతున్నా బహిరంగంగా చెప్పడం లేరు. ఈ నేపథ్యంలో సంగారెడ్డికి చెందిన జగ్గారెడ్డి కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. పీసీసీ లేదా మంత్రి పదవి కోసం ఆయన ఢిల్లీ నేతలను కలిసేందుకు వెళ్లారనే ఊహాగానాలు సాగుతున్నాయి. మరోవైపు.. సీఎంగా ఓసీ అయిన రేవంత్రెడ్డి ఉన్నందున పీసీసీ చీఫ్గా బీసీకి లేదా ఎస్సీకి అవకాశం కల్పిస్తారనే అభిప్రాయాలున్నాయి. గతంలో ఓసీలు సీఎంగా ఉన్నప్పుడు డి.శ్రీనివాస్, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణలు పీసీసీ చీఫ్లుగా ఉండటాన్ని కొందరు నేతలు ప్రస్తావిస్తూ బీసీలకు ఎక్కువ అవకాశం ఉండవచ్చునని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇవాళ జరిగే సమావేశంలో పైన పేర్కొన్న అంశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE