తెలంగాణలో ఆరవరోజు కూడ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్టోబర్ 9, బుధవారం నాడు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మతో కలిసి ఆర్టీసీ అధికారులు, ఆర్టీఓలు, ఈడీలు, రీజినల్, డివిజనల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నాలుగు గంటలకు పైగా రాష్ట్రంలో రవాణా ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండడం వలన ప్రజలు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అజయ్ తెలిపారు. ప్రస్తుతం సరిపడినన్ని బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో చార్జీలపై దృష్టి పెడుతామని అన్నారు. టికెట్ ధరను మించి ఒక్క రూపాయి ఎక్కువగా ప్రయాణికుల నుంచి వసూలు చేసిన కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రతి బస్సులో ఆ రూట్లలో ఉండే చార్జీల పట్టికను, కంట్రోల్ రూమ్ నెంబర్లతో సహా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అధిక చార్జీల వసూలుపై ఫిర్యాదుల కోసం ప్రతి డిపోలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, పరిశీలన కోసం పోలీస్ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్చార్జీగా నియమిస్తామని అన్నారు.
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెకు ముందు అన్నిరూట్లలో ఎలాంటి షెడ్యూల్ ఉండేదో , అదే షెడ్యూల్ను పూర్తి స్థాయిలో శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో అన్ని రకాల బస్సు పాసులను అనుమతించాలని, పాసులపై ఎటువంటి ఫిర్యాదులు రావద్దని మంత్రి స్పష్టం చేసారు. బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5,049 బస్సులు తిరిగాయని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఇందులో 3,116 ఆర్టీసీ బస్సులు,1,933 ఆర్టీసీ అద్దె బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు ఉన్నాయని చెప్పారు. ఇకనుంచి ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని వాహనాలు నడుపుతామని చెప్పారు.
[subscribe]