ఢిల్లీ మద్యం కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ కార్యాలయంలో కాకుండా తమ నివాసంలో విచారణ చేయాల్సిందిగా సీబీఐ అధికారులను కోరినట్లు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారందరినీ సీబీఐ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారని, అయితే ఎమ్మెల్సీ కవితకు ఎందుకు మినహాయింపు ఇస్తున్నారని సీబీఐ అధికారులను ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులపై తమకు అనుమానాలు ఉన్నాయని, కవితను ఇంట్లోనే విచారణ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడబలుక్కుని రాజకీయాలు చేస్తున్నాయని, బెంగాల్ తరహా ఫార్ములాను ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ అని, దీనిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ హెచ్చరించారు. ఒకవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంటూ టీఆర్ఎస్ హడావిడి చేస్తుంటే, మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం అంటూ బీజేపీ విమర్శలు చేస్తోందని.. వారికి చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు సంస్థల ఎదుట నిజాలు చెప్పాలని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అవినీతిపై కూడా విచారణ జరపాలని, ఈ విషయంపై తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడరని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE