‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన కేసులో అరెస్టయి చంచల్గూడ జైల్లో ఉన్న యువకులతో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో జూన్ 27న తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టానున్నామని, దీనిలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఆర్మీ ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనాలోచిత నిర్ణయం వలనే దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువకులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే కేసులను ఎదుర్కొంటున్న యువకులకు ఏదేని న్యాయ సలహా కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాలుగేళ్లు పని చేసి బయటకు వెళితే వారికి కనీసం మాజీ సైనికుడు హోదా కూడా దక్కక పోవడం దారుణమని, 22 ఏళ్లకే వారు ఉద్యోగం నుంచి తీసివేయబడితే వారి భవిష్యత్ భద్రతకు ఎవరు పూచీ అని ప్రశ్నించారు.
ఆనాడు దేశంలో 18 నుండి 25 ఏళ్ల లోపు ఉన్న 25 కోట్లు మంది యువకులు ప్రధానిగా మోదీని ఎన్నుకున్నారని, రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మిన వ్యక్తిని ఇదే యువకులు ప్రధానిని చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇలాంటి కీలక నిర్ణయం తీసుకునే ముందు చట్టసభల్లో చర్చించి, అందరి అభిప్రాయం తీసుకుని ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండేళ్లు పాటు ఇవ్వాల్సిన శిక్షణను కేవలం 6 నెలల్లోనే ఇస్తామని చెప్తున్నారని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేసిన ఆర్మీ పరీక్ష తిరిగి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, విచారణ ఆలస్యం అయితే వారి భవిష్యత్ దెబ్బ తింటుందని, కావున వెంటనే కేసుల విచారణ చేపట్టాలని, 40 రోజుల్లో విచారణను పూర్తి చేయాలని కోరారు. అనేకమంది యువకులపై అక్రమంగా 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY