ఆదివారం నాడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే, కొత్తగా మంత్రివర్గంలోకి ఆరుగురికి చోటు కల్పించారు. అయితే మంత్రి వర్గ విస్తరణ అనంతరం అవకాశం దక్కని నేతలు ఒక్కొక్కరిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెరాస పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి టిఆర్ఎస్ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసారు, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసంతృప్తి వ్యక్తం చేసారు. కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేసారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, ముషీరాబాద్ లో ముఠాగోపాల్ ను గెలిపించుకుని వస్తే మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని గుర్తు చేసారు. కనీసం తన అల్లుడికైనా టికెట్ ఇవ్వాలని కోరానని, తరువాత తన అల్లుడికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని, అయితే అవేమి జరగలేదని తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసారు.
తనకు ఏ కార్పొరేషన్ పదవి వద్దని, రాష్ట్ర హోం శాఖ మంత్రిగా చేసిన తనకు ఇప్పుడు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తానంటే ఎవరికీ కావాలి అని ప్రశ్నించారు. కేసీఆర్ మాఇంటికి పెద్ద, అయితే మేమంతా టిఆర్ఎస్ పార్టీకి ఓనర్లమే అని, కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో వాళ్ళిష్టం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతము నాయిని నర్సింహారెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య కూడ మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేకపోవడం బాధాకరమని, తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం మాదిగలు ఉన్నారని గుర్తుచేశారు.
[subscribe]
[youtube_video videoid=NovBgIywI_U]