గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలను, ప్రవేశపెట్టిన పథకాలను, కల్పించిన మౌలిక వసతులు సహా అభివృద్ధిపై పూర్తి సమాచారాన్ని ఒక ప్రగతి నివేదిక తయారు చేసి విడుదల చేస్తామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. మంగళవారం ఆయన జీహెచ్ఎంసి కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు.
వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించి, వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధిపరచి, లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్ కు టిఆర్ఎస్ ప్రభుత్వం రప్పించిందని చెప్పారు. గత ఐదు సంవత్సరాల్లోనే టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 67 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసిందని తెలిపారు. జీహెచ్ఎంసి పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు కేటిఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ విధానంలో భాగంగా ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించిన వివరాలను ప్రజలకు మరింత స్పష్టంగా అర్ధమయ్యేలా వివరించాలని కార్పొరేటర్ లకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు.
హైదరాబాద్ నగరంలో అనేక కారణాలతో కొన్ని కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ప్రజల ఆస్తులపైన సంపూర్ణ హక్కులు అందించకుండా, కొన్ని సమస్యలతో కొనసాగుతున్నాయన్నారు. వీటన్నింటినీ సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీసుకువచ్చారని చెప్పారు. స్థిరాస్తులపైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని, ఇలాంటి ప్రక్రియలో దళారులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లకు మంత్రి కేటిఆర్ సూచించారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచేందుకు నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లు అందరిని ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పారు. అక్టోబర్ 1వ తేదీన ప్రతీ ఒక్కరు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించాలని ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu