కోవిడ్-19 (కరోనా వైరస్) కు కేంద్ర బిందువైన చైనా దేశంలో ఇటీవలే ‘క్యాట్ క్యూ’ అనే కొత్త వైరస్ కూడా ప్రబలుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన క్యాట్ క్యూ వైరస్ గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీచేశారు. దేశంలో ఈ వైరస్ వలన అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. మానవులలో ఈ వైరస్ జ్వరం సంబంధిత అనారోగ్యాలు, మెనింజైటిస్ సహా ఇతర వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. క్యూలెక్స్ దోమలు మరియు పందులలో క్యాట్ క్యూ వైరస్ ఉన్నట్లు చైనా మరియు వియత్నాం దేశాల్లో ఇప్పటికే నివేదించబడినట్టు పేర్కొన్నారు.
పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు దేశంలోని పలు రాష్ట్రాల నుండి పరీక్షించిన 883 మంది సీరం నమూనాలలో, ఇద్దరిలో ఈ వైరస్కు సంబంధించిన యాంటీబాడీలు ఉన్నట్టు కనుగొన్నారు. సహజంగా వైరస్ శరీరంపై దాడి చేసినప్పుడు, రోగనిరోధక వ్యవస్థ ద్వారా యాంటీ బాడీలు ఏర్పడతాయి. ఏదో ఒక సమయంలో వారికీ వైరస్ సంక్రమించిందని, అయినప్పటికీ అధ్యయనం సమయంలో మానవ లేదా జంతువుల నమూనాలలో వైరస్ కనుగొనబడలేదని పేర్కొన్నారు. ఈ వైరస్ దోమలు ద్వారా ప్రబలే అవకాశం ఉండడం, అలాగే దేశంలో క్యూలెక్స్ దోమలు ఎక్కువుగా ఉండడం వలన మనుషులకు వ్యాప్తించేందుకు అవకాశముందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వైరస్ వ్యాప్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం కోసం మనుషులతో పాటుగా పందుల నమూనాలను విస్తృతంగా పరీక్షించాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu