తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ అక్టోబర్ 19న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా జనసైనికులు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకి సమ్మె తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో కార్మికుల ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, తాజా పరిస్థితులపై జనసేన తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, ఇతర తెలంగాణ నాయకులతో సమావేశమై సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రెండువారాలుగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చిందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ లో రాణిగంజ్ కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంపై విచారం వ్యక్తం చేసారు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పారు. 48,000 మంది ఉద్యోగులను ఒకేసారి విధుల్లోంచి తప్పించామని ప్రకటించడంతో వారి కుటుంబాలలో ఆవేదన నెలకొని ఉందని చెప్పారు. ఈ పరిణామాలు కార్మికులలో అభద్రతా భావాన్ని పెంచాయని చెప్పారు. కార్మికుల సమ్మెకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం వారి డిమాండ్లను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు.
[subscribe]