ఆర్టీసీ యాజమాన్యంతో, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు ముగిసాయి. భేటీ అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ఈ చర్చలను నిర్బంధ చర్చలుగా వర్ణించారు, ఆర్టీసీ చరిత్రలో ఇటువంటి చర్చలు ఎప్పుడు చూడలేదని చెప్పారు. జేఏసీ తరపున 26 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచితే, వారు కేవలం 21 డిమాండ్లపైనే చర్చలు జరుపుతామని చెప్పారని అన్నారు. చర్చలు అసంపూర్తిగా, అర్ధంతరంగా ముగిసాయని, మళ్ళీ పిలిస్తే హాజరవుతామని అన్నారు. ఎప్పుడైనా 26 డిమాండ్లపైన చర్చ జరగాల్సిందే అని ఆయన పేర్కొన్నారు.
అక్టోబర్ 26, శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రమంజిల్లోని ఈఎన్సీ కార్యాలయంలో ఆర్టీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, కార్మిక సంఘాల నాయకులతో చర్చలు ప్రారంభించారు. కార్మికుల సంఘాల తరుపున కేవలం నలుగురికే చర్చల్లో పాల్గొనేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, మరో ముగ్గురు కో-కన్వీనర్లు భేటీకి హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి హాజరైన కార్మికుల సంఘాల నాయకులను వారి వెంట సెల్ఫోన్లను తీసుకొచ్చేందుకు అనుమతించలేదు. కార్మిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడ, ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసిన తరువాత మాత్రమే చర్చలు ప్రారంభమయ్యాయి. సుమారు రెండు గంటల పాటు ఈ చర్చలు జరిగాయి.
[subscribe]