గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలను సీఎం జగన్ వారిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత బాలికకి అండగా నిలవాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ, బాలిక పై దాడి జరిగిన ఒక రోజులోనే నిందితుడిని అరెస్ట్ చేశాం. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించామని చెప్పారు.
ప్రస్తుతం బాధిత బాలిక ఆసుపత్రిలో కోలుకుంటుంది. ప్రభుత్వం తరపున బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హోంమంత్రి సుచరిత హామీ ఇచ్చారు. మరో వైపు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అక్టోబర్ 25 శుక్రవారం నాడు బాలిక కుటుంబాన్ని కలిసి మాట్లాడారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. ప్రభుత్వ సహాయం సత్వరమే అందేలా కృషి చేస్తానని, గ్రామంలో రక్షణ కూడా కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
[subscribe]