భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లో మొదలైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో నేడు ‘విజయ సంకల్ప సభ’ పేరుతో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న ఈ సభలో ప్రధాని కీలక ప్రసంగం చేయనున్నారు. కాగా ఈ సభకు ప్రధాని మోదీతో పాటుగా అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు, పలు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు బేగంపేట్ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగసభ వద్ద భద్రతను పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ముఖ్యమైన నేతలంతా ఇక్కడకు రానున్నందున ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు పరేడ్ మైదానం పరిసరాల్లో దాదాపు 3 వేల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్తులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సభా వేదిక నుంచి తిరిగి ప్రధాని మోదీ విడిదికి చేరే వరకు అన్ని దారులలో భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కాగా బహిరంగ సభ అనంతరం ప్రధాని రాజభవన్ లో విడిది చేయనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ