టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక సందర్భంగా ఆదివారం మునుగోడు పట్టణంలో బీజేపీ ‘మునుగోడు సమరభేరి’ పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాజగోపాల్ రెడ్డికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ సర్కారు గద్దె దిగడం ఖాయమని, దానికి మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం ద్వారా బీజం పడుతుందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడమంటే కేవలం ఒక నాయకుడు చేరినట్లు మాత్రమే కాదని, ఇది కేసీఆర్ అవినీతి ప్రభుత్వానికి పతనమని పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలేవీ అమలు చేయలేదని, అన్ని వర్గాల ప్రజలను అబద్దపు హామీలతో మోసం చేశారని మండిపడ్డారు. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించేందుకు ‘దళిత బంధు’ పథకం పెట్టారని, దానిద్వారా ఎంతమంది దళితులకు రూ.10 లక్షలు ఇచ్చారని ప్రశ్నించారు.
ఇక టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీకి భయపడి దానిని అమలు చేయడం లేదని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ప్రజలకు అందిస్తామన్న నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, ప్రతి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి హామీలు నేడు ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2 లక్షల కోట్ల సాయం అందించినా, తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎందుకు అప్పుల ఊబిలోనే ఉందని నిలదీశారు. ఫసల్ బీమా పథకంతో ప్రధాని మోదీ రైతులను ఆదుకుంటుంటే, సీఎం కేసీఆర్ కొత్తగా చేసిందేంటని ఆయన అడిగారు. త్వరలోనే తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని, ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని అమిత్ షా వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY