నిరహార దీక్ష వలన తన ఆరోగ్యం దెబ్బతిందని, కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకుని సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి పాదయాత్ర కొనసాగిస్తానని ప్రకటించారు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. బుధవారం ఆమె హైదరాబాద్ లోని తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి నిశ్చయించుకున్న పాలేరు నియోజకవర్గానికి భూమి పూజ ఈ నెల 16న నిర్వహించడానికి ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. తాను ఇప్పటివరకు 3,500 కి.మీ పాదయాత్ర చేశానని, ఎక్కడా ఎలాంటి ఘర్షణలు కానీ, అల్లర్లు కానీ జరుగలేదని గుర్తు చేశారు. అయితే తన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళనకు గురయ్యిందని, అందుకే తన పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు మరోసారి తనకు అనుమతిచ్చిందని, దీనిపై సీఎం కేసీఆర్ ఏం సమాధానం చెప్తారని షర్మిల ప్రశ్నించారు. ఇక తాను నిరహార దీక్ష చేస్తుంటే భారీ సంఖ్యలో పోలీసులతో కర్ఫ్యు విధించారని, పార్టీ కార్యకర్తలను, మీడియాను కూడా పార్టీ ఆఫీసుకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తన ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు అణచి వేస్తున్నారని, అందుకే వారిపై కోర్టులో ప్రైవేటు కేసు వేయబోతున్నానని వెల్లడించారు. ఒకవైపు తెలంగాణలో అనేక రకాల సమస్యలతో తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ఇవేమీ పట్టని సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల రైతులకు మాత్రం చెక్కులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే లిక్కర్ స్కాం ద్వారా ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మహిళలనే కాదు, యావత్ తెలంగాణ ప్రజల పరువు తీశారని వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ