మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Telangana Dy CM Bhatti Vikramarka Invites Ex CM YS Jagan For His Son's Wedding

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే క్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కూడా ఆహ్వానించారు. మార్చి 5, 2026న హైదరాబాద్‌లో జరగనున్న ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

భట్టి విక్రమార్క తన కుమారుడి పెళ్లి పత్రికను ఇప్పటికే ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకులకు, అలాగే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా అందజేశారు. ఇక ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సందర్భంగా అమరావతిలో సీఎం చంద్రబాబు ను కలిసి ఆహ్వానించిన ఆయన, అనంతరం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు కూడా సమాచారం అందించారు.

అయితే, మార్చి 4న జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పటికీ, మార్చి 5న హైదరాబాద్‌లో జరిగే ఈ వివాహ వేడుకకు ఆయన హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి.

గత ఏడాది నవంబర్‌లో జరిగిన సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థానికి ఇప్పటికే గవ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు చిరంజీవి వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు వివాహానికి జగన్ రాకతో ఈ వేడుక మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోనుంది.

కాగా, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తరుణంలో భట్టి విక్రమార్క వంటి సీనియర్ నేత ఇంటి వేడుకకు పక్షపాత రహితంగా అందరు రాజకీయ ఉద్ధండులు హాజరుకానుండటం విశేషం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు రాష్ట్రాల మధ్య సమన్వయం కోరుతున్న వేళ, ఇలాంటి సామాజిక భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ వివాహ వేడుకకు అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ మరియు వైఎస్సార్‌సీపీకి చెందిన ముఖ్య నేతలు హాజరై సందడి చేయనున్నారు. భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లి వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యనేతలందరూ ఒకే చోట కలిసే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, కుటుంబ వేడుకల ద్వారా నాయకుల మధ్య సత్సంబంధాలు కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here