జూలై 3 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు

Union Home Minister Amit Shah Directs Multi-Layered Impregnable Security for Amarnath Yatra

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అమర్‌నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహాలయ దర్శనానికి వెళ్లే భక్తుల రక్షణే పరమావధిగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జూలై 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వార్షిక యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో సాగేలా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌), జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ శాఖతోపాటు దేశంలోని అన్ని అగ్రశ్రేణి భద్రతా సంస్థలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

యాత్రా మార్గంతో పాటు కశ్మీర్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లోనూ బహుళ అంచెల పటిష్ఠ భద్రతా గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని అమిత్ షా ఆదేశించారు. సంప్రదాయ భద్రతా విధానాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా నిరంతర నిఘా కోసం డ్రోన్లు, హై-డెఫినిషన్ సీసీటీవీ నెట్‌వర్క్‌లు, అత్యాధునిక నిఘా వ్యవస్థలను రంగంలోకి దించాలన్నారు. బేస్ క్యాంపులు, యాత్రా మార్గాల్లోని కదలికలను సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి అత్యవసర లేదా వైద్య పరిస్థితులకైనా తక్షణమే స్పందించేలా క్విక్ రియాక్షన్ టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం భక్తుల భద్రతతో పాటు కల్పించాల్సిన వసతులకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. యాత్రికుల బయోమెట్రిక్ నమోదు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని, వసతి, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఎత్తైన కొండల్లో సాగే ప్రయాణం కావడం వల్ల భక్తులకు శ్వాసకోస ఇబ్బందులు ఎదురైతే తక్షణ చికిత్స అందించేందుకు ఆక్సిజన్ హైపర్‌బారిక్ ఛాంబర్లు, నిపుణులైన వైద్యులు, క్రిటికల్ కేర్ అంబులెన్స్‌లతో కూడిన ప్రత్యేక వైద్య శిబిరాలను మార్గమధ్యంలో అందుబాటులో ఉంచాలన్నారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తితే వాటి సూచనల ఆధారంగానే భక్తుల బ్యాచ్‌లను ముందుకు అనుమతించేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ యాత్రలో పాల్గొనే స్థానిక ప్రజలు, సహాయక జంతువుల (గుర్రాలు, కచ్చడాలు) వివరాలను సైతం తప్పనిసరిగా నమోదు చేయాలని హోంమంత్రి ఆదేశించారు. భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డులను జారీ చేయాలని, యాత్ర సజావుగా సాగేందుకు స్థానికుల సహకారాన్ని కూడా తీసుకోవాలని అధికారులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here