సవాల్ చేస్తే కట్టుబడాలి, తెలంగాణ భవన్‌కు వెళ్ళుండాల్సింది.. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Strict Instructions To Ministers Over Political Challenges

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మంత్రుల తీరుపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు కీలక సూచనలు చేశారు. ప్రతిపక్షాలు విసిరే సవాళ్లకు ప్రతిస్పందించేటప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, వెనక్కి తగ్గడం ద్వారా వారికి అనవసరమైన రాజకీయ లబ్ధి చేకూర్చవద్దని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌కు వెళ్తానని సవాలు విసిరిన ఒక మంత్రి అక్కడికి వెళ్లకుండా సీఎల్పీలోనే ఉండిపోవడంపై ముఖ్యమంత్రి ప్రశ్నించినట్లు సమాచారం.

అలాగే బహిరంగ చర్చల కోసం కొందరు మంత్రులు గన్‌పార్క్‌కు వెళ్లి రెండు గంటల పాటు వేచి చూసి వచ్చేయడంపైనా చర్చ జరిగింది. బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చేదాకా అక్కడే ఉండి ఉంటే, వాస్తవాలను ప్రజల ముందు ఉంచి ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసే అవకాశం దక్కేదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల వద్ద లేవనెత్తేందుకు ఎలాంటి సరైన అంశాలు లేవని, మంత్రులు విసిరే కొత్త సవాళ్ల ద్వారా వాళ్లకు మీరే పని కల్పించొద్దని ఆయన హితవు పలికారు.

గురుకులాల టెండర్ల వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగకపోయినా, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారని అసంతృప్తి వ్యక్తమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడం, విద్య, వైద్యరంగాల్లో సంస్కరణలు, పేదలకు సన్న బియ్యం పంపిణీ, రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు మరియు రుణమాఫీ వంటి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

గృహజ్యోతి, ఉచిత బస్సు వంటి ప్రజా రంజక పథకాలు అమలు చేస్తూ ఆర్థిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. ప్రజల్లోకి వెళ్లడానికి ప్రతిపక్షాలకు మైదానమే లేకుండా చేశామని, ఇలాంటి తరుణంలో కొత్త సమస్యలు సృష్టించుకోవద్దని సూచించారు. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకమైన మూసీ పునరుజ్జీవన పథకం తొలి దశను 2027 డిసెంబరుకల్లా పూర్తిచేసి, ఆ తర్వాతే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.

రానున్న ఎన్నికల ప్రచార వ్యూహంలో మూసీ తొలిదశ పూర్తి కూడా ఒక ప్రధాన నినాదంగా ఉండబోతోందని స్పష్టం చేశారు. కాగా, యాదాద్రి ఆలయ పాలకమండలి నియామకం విషయంలో ముందస్తు సమాచారం లేదనే అసంతృప్తితో ఒక మహిళా మంత్రి ఈ క్యాబినెట్‌ భేటీకి గైర్హాజరైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here