తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో ఆసక్తికర పోస్టు పెట్టారు. రెండు దశాబ్దాల తన రాజకీయ, ప్రజా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ప్రేమ, ఆదరణ తనకు అపారమైన బలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. లక్షల అక్షరాలతో రాసినా, కోట్ల పదాలను కూర్చి చెప్పినా తరగని మధుర జ్ఞాపకం ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితమని వ్యాఖ్యానించారు. నాడు మిడ్జిల్లో రేవంత్ రెడ్డిగా మొదలై నేడు అందరి గుండెల్లో రేవంతన్నగా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని అభివర్ణించారు.
లక్షల అక్షరాలతో రాసినా…
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.ఈ 20 ఏళ్లలో ప్రతి… pic.twitter.com/cVyPl4rvJp
— Revanth Reddy (@revanth_anumula) July 4, 2026
ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో ప్రజల కోసం తాను చేసిన ప్రతి పోరాటంలో తనతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, అందరి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా, అన్నింటికీ మించి రేవంతన్నగా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.
సుదీర్ఘమైన ఈ రాజకీయ ప్రయాణంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ, స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజల ఆదరాభిమానాలతో ముడిపడి ఉన్న ఈ రెండు దశాబ్దాల అనుభవం భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మరింత దోహదపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






































